విజయం సాధించిన భారత్..‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా అక్షర్ పటేల్

     Written by : smtv Desk | Mon, Jul 25, 2022, 02:52 PM

విజయం సాధించిన భారత్..‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా అక్షర్ పటేల్

నిన్న క్వీన్స్‌పార్క్ ఓవల్ మైదానం లో జరిగిన రెండవ వన్డే సిరీస్ లో భారత్ గెలుపుని సొంతం చేసుకుంది. శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ హాఫ్ సెంచరీకి తోడు చివరిలో అక్షర్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇంకా రెండు బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ ఇన్నింగ్స్‌ లో విండీస్ షాయ్ హోప్ మొదటి బాట్స్ మెన్ గా వెళ్లి (115) పరుగులు తీసి ఒక గొప్ప ఆటగాడిగా పేరుగాంచాడు. చివరికి 311 పరుగుల భారీ స్కోరు కు గాను 6 వికెట్ లను కోల్పోయి విజయం సాదించింది.
312 పరుగుల భారీ లక్ష్యం కావడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలుత తడబడింది. 48 పరుగుల వద్ద కెప్టెన్ శిఖర్ ధావన్ (13) అవుటయ్యాడు. ఆ తర్వాత కూడా స్వల్ప వ్యవధిలోనే శుభమన్ గిల్ (43), సూర్యకుమార్ యాదవ్ (9) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ క్రీజులో కుదురుకోవడంతో జట్టు నిలదొక్కుకున్నట్టు కనిపించింది.
అయితే, అయ్యర్ 63, శాంసన్ 54 పరుగులు చేసి అవుటయ్యాక టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. 205 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోవడం, ఆదుకుంటాడనుకున్న దీపక్ హుడా 33 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడం, శార్దూల్ ఠాకూర్ (3), అవేశ్ ఖాన్ (10) కూడా క్రీజులోకి వచ్చినట్టు వచ్చి వెనుదిరగడంతో భారత్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ క్రీజులో పాతుకుపోయిన అక్షర్ పటేల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు.
చివరి ఓవర్‌లో భారత జట్టు విజయానికి 8 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి అక్షర్ పటేల్ ఒక్క పరుగు తీశాడు. మూడో బంతికి సిరాజ్ మరో పరుగు తీసి అక్షర్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఇప్పుడు మూడు బంతుల్లో ఆరు పరుగులు అవసరం. మేయర్స్ వేసిన నాలుగో బంతిని అక్షర్ పటేల్ బలంగా బాదాడు. అంతే.. బంతి అలా ఎగురుకుంటూ వెళ్లి స్టాండ్స్‌లో పడింది. భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.
దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతమైంది. మొత్తంగా 8 వికెట్లు కోల్పోయిన భారత్ చివరి ఓవర్‌లో విజయాన్ని అందుకుని ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. 35 బంతుల్లో 3 ఫోర్లు, ఐదు సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేసిన అక్షర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అక్షర్‌కు వన్డేల్లో ఇదే తొలి అర్ధ సెంచరీ. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.





Untitled Document
Advertisements