ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసమీ, తమిళనాడు మీదుగా కొమెరిస్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
కోస్తాంధ్ర, తమిళనాడు దాని పరిసర ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఉంటుంది. పశ్చిమ మధ్య దానిని అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో అల్పపీడన ద్రోణి ఉందని వెల్లడించింది. దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల్లో ఆగస్టు 5, 6 తేదీల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనుండగా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. పలు జిల్లాల్లో రైతులు పొలం పనులు మొదలుపెట్టి నాట్లు వేస్తున్నారు.