పిల్లలకు కచ్చితంగా డబ్బు విలువ చెప్పాల్సిందే.. ఎందుకో చుడండి..

     Written by : smtv Desk | Wed, Aug 03, 2022, 12:58 PM

పిల్లలకు కచ్చితంగా డబ్బు విలువ చెప్పాల్సిందే.. ఎందుకో చుడండి..

మన నిత్యజీవితంలో డబ్బుతోనే చాలా విషయాలు ముడిపడి ఉంటాయి. అయితే డబ్బు సంపాదించడం కంటే దాన్ని సరైన అవసరాల కోసం ఖర్చు చేయడం, దాచడం వంటివి మరింత విలువైన, కష్టమైన పనులు అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అందుకే స్కూల్ లెవల్ నుంచే ఇలాంటి వాటిపై అవగాహన పెంచే ఫైనాన్షియల్ లిటరసీపై అవగాహన పెంచుకుంటే, మనీ మేనేజ్‌మెంట్‌ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడవచ్చు. అయితే ఇప్పటికీ స్కూల్స్‌లో దీని గురించి విద్యార్థులకు అవగాహన కల్పించకపోవడం దురదృష్టకరం.
చదవడం, రాయడం మాదిరి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కూడా ఒక కీలక నైపుణ్యం. ఫైనాన్షియల్‌గా సక్సెస్ కావాలంటే ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. సంపద సృష్టించడానికి, జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే మనీ మేనేజ్‌మెంట్ పాఠాలపై అవగాహన ఉండాలి. కానీ, ప్రస్తుత మన విద్యా విధానం విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను అందించడంలో విఫలమైంది.
ఓ సర్వే ప్రకారం.. 53 శాతం పెద్దవారు, ఆర్థిక విషయాలపై అవగాహన లేక ఆందోళన చెందుతున్నారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రకారం.. ఆర్థిక అక్షరాస్యత సరిగా లేక 40.2 శాతం మంది డబ్బు విషయంలో స్నేహితులు, పరిచయస్తులపై ఆధారపడుతున్నారు. ఇది పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. ఈ విషయంపై యునైటెడ్ స్టేట్స్‌ నేషనల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్స్ కౌన్సిల్ సీఈవో విన్స్ షోర్బ్ మాట్లాడుతూ.. "కాలేజీ గ్రాడ్యుయేట్లు ఎక్కువ జీతం పొందడానికి సహాయపడే నైపుణ్యాలను నేర్చుకోవడానికి 16 ఏళ్లు కష్టపడతారు. అయితే వారు డబ్బును పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం, ఆర్థికంగా ఎదగడానికి ఎక్కువ సమయం కేటాయించలేరు.'' అని చెప్పారు.
* ఇంటి నుంచే ప్రారంభం : మనీ బేసిక్స్ ఇంటి నుంచే ప్రారంభం కావాలి. తల్లిదండ్రులు డబ్బు విషయంలో పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ, చిన్న చిన్న ఆర్థిక పాఠాలు నేర్పించాలి. ఫ్యామిలీ బడ్జెట్‌ను రూపొందించి పిల్లలకు డబ్బు బడ్జెట్ పాఠాలను నేర్పించాలి. ఇది స్వల్పకాలిక, దీర్ఘకాలిక డబ్బు లక్ష్యాలను సాధించడానికి పిల్లలను ప్రోత్సహిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను నాలుగు పాకెట్లలో డబ్బును సేవ్ చేయడానికి ప్రోత్సహించాలి. ఒకటి విద్య పొదుపు కోసం, రెండోది ఆటలు- వినోదం, మూడోది సెలవుల కోసం, ఇక నాలుగోది ఖర్చులను ప్లాన్ చేయడంలో సహాయపడే భవిష్యత్తు పొదుపు కోసం. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఈ రోజుల్లో పిల్లలు దేన్నైనా త్వరగా నేర్చుకుంటారు. కాబట్టి, వారికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పడం సులభం.
* స్కూల్స్‌లో ఆర్థిక అక్షరాస్యత బోధన ప్రాముఖ్యత : పిల్లలను ఆర్థిక ప్రపంచం కోసం సిద్ధం చేయడంలో అనుసరించే విధానం చాలా ముఖ్యం. పాఠ్యాంశాలకు ఆర్థిక అక్షరాస్యత వంటి అంశాలను జోడించడం ద్వారా పిల్లలు జీవితం విలువను తెలుసుకుంటారు. డబ్బు నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారు.
ఉపాధ్యాయులకు పర్సనల్ ఫైనాన్స్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ ప్రక్రియకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక స్వాతంత్ర్యం అంటే మీకు కావలసిన విధంగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి నైపుణ్యాలపై పట్టుసాధించడం. కాగా, పాశ్చాత్య దేశాల్లో పిల్లలు డబ్బును పొదుపు చేసే విధంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయమని ప్రోత్సహిస్తారు.
ఆర్థిక అక్షరాస్యత విద్యార్థులకు డబ్బు విషయంలో స్వతంత్రంగా వ్యవహరించడంలో సహాయపడుతుంది. పెట్టుబడి ఎంపికలు, బడ్జెట్, క్రెడిట్, పొదుపులు, పన్నులు, ఆర్థిక మార్కెట్లు మొదలైన వాటిపై ప్రాథమిక జ్ఞానంతో వారిని బలోపేతం చేస్తుంది. పాఠశాల స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత బోధించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు-సన్నద్ధం చేయవచ్చు. ప్రతిరోజూ పొదుపు చేసే చిన్న మొత్తాలు భవిష్యత్తులో భారీ పెట్టుబడులుగా మారతాయి.





Untitled Document
Advertisements