కేంద్రంలోని బీజేపీ సర్కారు పని తీరును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటన చేయడం దారుణమని ఆయన అన్నారు. ధాన్యం సేకరణ వల్ల నష్టం వస్తుందని దానిని ప్రైవేటుపరం చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సుధాంషు పాండే బుధవారం చేసిన ప్రకటనను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే...ఇక రైతులకు ఉచిత విద్యుత్ అనేదే దక్కదని కూడా కేటీఆర్ అన్నారు. రైతులకు ఇస్తున్న రాయితీలు ఎత్తివేసేందుకే కేంద్రం విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెడుతుంది అని ఆయన ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వస్తే తెలంగాణ రైతాంగం అధికంగా నష్టపోతుంది అని ఆయన అన్నారు. ఈ సంస్కరణలు అమలు అయితే రైతులకు ఉచిత విద్యుత్ ఉండదని, సొంత పొలంలో రైతులు కూలీలుగా మారే పరిస్థితి వస్తుంది అని ఆయన అన్నారు.