భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం రాత్రి 7 మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ జరగడం వల్ల ఫాన్స్ ఆసక్తికరం ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు సికింద్రాబాద్లోని జింఖానా క్రికెట్ స్టేడియంలో టికెట్లని ఆఫ్లైన్లో అమ్మకానికి ఉంచారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ కేవలం 3 వేల టికెట్లని మాత్రమే అమ్మకానికి ఉంచగా ఏకంగా 30 వేల మంది పైన అభిమానులు పోటీపడ్డారు. దాంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 20 మంది గాయపడగా. ఒక మహిళ పరిస్థితి విషమంగా మారింది.
అసలు ఎందుకు ఈ గందరగోళం అంటే? ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 39,000. ఈ టికెట్లని మొదట పేటీఎంలో అమ్మకానికి ఉంచినట్లు హెచ్సీఏ పెద్దలు ప్రకటించారు. కానీ పేటీఎంలో నిమిషాల వ్యవధిలోనే సోల్డ్ ఔట్గా చూపించింది. దాంతో 39,000 టికెట్లని అమ్మకానికి ఉంచలేదని ఓ 10-15 టికెట్లని మాత్రమే పేటీఎంలో ఉంచినట్లు అభిమానులు ఆరోపించారు. అంతేకాకుండా జింఖానా క్రికెట్ గ్రౌండ్లో బుధవారం నుంచి టికెట్లని ఆఫ్లైన్లో అమ్మబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. దాంతో.. వేలాదిగా అభిమానులు బుధవారం జింఖానాకి చేరుకున్నారు. కానీ.. అక్కడ టికెట్లు అమ్మకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన చెపట్టి అక్కడే ఉండిపోయారు.
అభిమానుల తీరుతో హెచ్సీఏ పెద్దలు దిగొచ్చారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ టికెట్లని జింఖాలో.. అది కూడా ఆఫ్లైన్లో అమ్మబోతున్నట్లు ప్రకటించారు. దాంతో.. బుధవారం రాత్రి నుంచే వేలాది మంది అభిమానులు అక్కడ వేచి ఉన్నారు. కానీ.. గురువారం ఒక్కసారిగా అభిమానులు టికెట్ల కోసం దూసుకురావడంతో పోలీసులు వారిని నియంత్రించలేకపోయారు. దాంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. వాస్తవానికి ఈ టికెట్లపై మొదటి నుంచి గందరగోళం నడుస్తోంది. తొలుత అన్ని టికెట్లు అమ్ముడుపోయినట్లు హెచ్సీఏ ప్రకటించింది. ఆ తర్వాత అభిమానులు నిరసన తెలపడంతో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దాంతో..కంటితుడుపు చర్యల్లో భాగంగా 3 వేల టికెట్లని ఆఫ్లైన్లో అమ్మబోతున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది. అయితే.. మిగిలిన టికెట్లు ఏమైపోయాయి? బ్లాక్లో అధిక ధరకి అమ్మేసుకున్నారా? అని అభిమానులు మండిపడుతున్నారు. హెచ్సీఏ పెద్దలు చెప్పినదాని ప్రకారం దాదాపు 9 వేల మందికి కాంప్లిమెంటరీ పాస్ల రూపంలో టికెట్లు ఇవ్వబోతున్నారు. మిగిలిన టికెట్లలో సగం ఆన్లైన్లో ఇప్పటికే అమ్ముడుపోగా.. ఓ 10-12 వేల టికెట్లపై లెక్కలు తేలడం లేదు. దాంతో హెచ్సీఏ తీరుపై తెలంగాణ ప్రభుత్వం విచారణకి ఆదేశించింది.