ఏపీకి మరో కొత్త జాతీయ రహదారి రాబోతోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. రాజధాని అమరావతికి సమీపంలోని విజయవాడ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఓ కొత్త రహదారి రానుంది. అయితే దీనిపై ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్ట్కు పచ్చజెండా ఊపారు. ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్యయ్య చౌదరి వెల్లడించారు.
కాగా విజయవాడ నుంచి కడప మీదుగా బెంగళూరుకు కొత్త రహదారి రానుంది. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తన ట్విట్టర్ ద్వారా అబ్యయ్య చౌదరి తెలిపారు. ఈ కొత్త రహదారి అందుబాటులోకి వస్తే.. విజయవాడ, బెంగళూరు మధ్య 75 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. అదే సమయంలో 2 గంటల సమయం కూడా ఆదా కానుంది. మొత్తం 342 కిలోమీటర్ల దూరంగా కొత్త రహదారి ఏర్పాటు చేయనున్నారు.
రహదారి నిర్మాణానికి రూ.13600 కోట్ల నిధులు కేటాయించారు. ఈమేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఎమ్మెల్యే కొఠారు అబ్యయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి మరో జాతీయ రహదారి రాబోతుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీని వల్ల పలు జిల్లాలు అభివృద్ధి చెందుతాయంటున్నారు. రాజధాని, విజయవాడ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సీఎం జగన్ చొరవ వల్లే జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.