కొన్ని రోజులుగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్ష పదవీ ఎన్నిక ఆసక్తికర మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటికే అధ్యక్ష రేసు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పుకోగా... తాజాగా దిగ్విజయ్ సింగ్ కూడా భరీలో నుండి తప్పుకున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో.. డిగ్గీరాజా పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మాత్రమే మిగిలారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగియనుంది.
మరోవైపు ఈ నామినేషన్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే తనకు సీనియర్ అని...నిన్న తనని కలవడానికి ఆయన నివాసానికి తాను వెళ్లానని, మీరు పోటీ చేస్తే తాను బరి నుంచి తప్పుకుంటానని చెప్పానని తెలిపారు. అయితే, తాను పోటీ పడటం లేదని ఆయన అన్నారని... అయితే, అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలను తాను చూశానని, అందుకే బరి నుంచి తప్పుకున్నానని చెప్పారు. తాను ఖర్గేకు మద్దతుగా నిలుస్తానని, ఆయనపై పోటీ చేసే ఆలోచనను కూడా తాను చేయనని అన్నారు.
తన జీవితంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ కే పని చేశానని, చివరి వరకు కాంగ్రెస్ తోనే ఉంటానని దిగ్విజయ్ చెప్పారు. దళితులు, గిరిజనులు, పేదలకు అండగా నిలవడం, మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోరాడటం, నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటం.. ఈ మూడు అంశాలలో తాను ఎప్పటికీ రాజీపడలేనని చెప్పుకొచ్చారు. మరీ చూడాలి కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో.