పర్వదినాల్లో ఆరోగ్యకరమైన ఉపవాసాలు చేయండి ఇలా..

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 03:02 PM

 పర్వదినాల్లో ఆరోగ్యకరమైన ఉపవాసాలు చేయండి ఇలా..

నవరాత్రుల వంటి ప్రత్యేక పర్వదినాల్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకి ఉపవాసాలు ఉంటారు. నిజానికి ఉపవాసం అంటే కడుపు మార్చుకోవటం కాదు దేవుడికి దగ్గరగా ఉండటం .ఈ క్రమంలో కొంతమంది రోజంతా ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుంటుంటారు. అలా కడుపు మాడ్చుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడతామంటున్నారు పోషకాహార నిపుణులు. నిర్ణీత వ్యవధుల్లో సాత్వికాహారం తీసుకుంటూ అటు శరీరానికి శక్తిని అందిస్తూనే, ఇటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో అమ్మవారిని కొలిచే అతివలు ఆరోగ్యానికి లోటు లేకుండా, ఉత్సాహం తగ్గకుండా ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..
*రోజును ఇలా ప్రారంభించండి : కొంతమందైతే రోజంతా నోట్లో పచ్చి మంచినీళ్లైనా పోయకుండా ఉపవాసం చేస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ముందుగా మనం లేవగానే మన శరీరంలోని మలినాలను బయటికి పంపించాలి.. అప్పుడే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.. అలాగే జీవక్రియలూ చురుగ్గా మారతాయి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పటికీ ఉదయం లేవగానే నిమ్మరసం కలిపిన గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగాలి.
*శారీరక శక్తి కోసం : ఉపవాసం పేరుతో రోజంతా తినకుండా ఉంటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు పడిపోతాయి. కాబట్టి ఉపవాసం ఉన్నా పూర్తిగా కడుపు మాడ్చుకోవడం అస్సలు కరక్ట్ కాదు. నిర్ణీత వ్యవధుల్లో పండ్లు తీసుకోవాలి. ఇక మధ్యమధ్యలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎలాగూ ఉపవాసం కదా.. అన్నం తినడం లేదు కదా అని స్వీట్లు, డీప్‌ ఫ్రై చేసిన స్నాక్స్‌.. అస్సలు తీసుకోవద్దు.
*మంచి కొవ్వులే మేలు : ఇక ఉపవాసం సమయంలో చాలామంది పాలు, మజ్జిగవంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలో కొవ్వులు అధికంగా ఉండేవి కాకుండా.. కొవ్వు తొలగించినవి లేదంటే తక్కువ కొవ్వులున్న పాలు, మజ్జిగ.. వంటివి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయులు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే మంచి కొవ్వులు పుష్కలంగా లభించే పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. వాటిలోని పీచు పదార్థం ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది అలాగే జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఉపకరిస్తుంది.
*నీటి స్థాయులు తగ్గకుండా : శరీరంలో నీటి శాతం తగ్గిపోయినా నీరసించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఉపవాసం సమయంలో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండాలంటే నీళ్లు తాగడం, మధ్యమధ్యలో మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, నిమ్మరసం-తేనె కలిపిన నీళ్లు తీసుకోవడం మంచిది. వీటితో పాటు కీరా, టొమాటో.. వంటి కాయగూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు తగ్గకుండా కాపాడుకోవచ్చు. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండడంతో పాటు ఇతర అవయవాల పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.
వీరికి ఉపవాసం వద్దు : వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భం ధరించిన మహిళలు ఈ పండగ సమయంలో ఉపవాసం ఉండకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఉపవాసం వల్ల సరైన సమయానికి ఆహారం అందక.. వారికి రక్తంలో చక్కెర స్థాయులు పడిపోయే అవకాశం ఉంది. తద్వారా లేనిపోని అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఉపవాసం జోలికి పోకుండా కడుపునిండా పోషకాహారం తీసుకోవడంతో పాటు నిపుణులు చెప్పినట్లుగా ఆరోగ్యవంతమైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ దసరా శరన్నవరాత్రుల్ని ఆనందంగా, ఉత్సాహంగా గడపచ్చు.





Untitled Document
Advertisements