గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12:31 నిమిషాలకు సుదర్శన్ మరణించారని ఆయన కుమారుడు సింగరి రాజ్ కుమార్ తెలిపారు. ఆయనఅంతిమ యాత్ర ఖైరతాబాద్ నుంచి ప్రారంభమై పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక వరకు కొనసాగుతుందన్నారు.
వినాయక చవితి అనగానే. హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ బడా గణేశ్ గుర్తొస్తాడు. ఖైరతాబాద్ కౌన్సిలర్గా పని చేసిన సుదర్శన్ సోదరుడు సింగరి శంకరయ్య చేతుల మీదుగా 1954లో ఇక్కడ గణేశ్ ఉత్సవాల నిర్వహణ మొదలైంది. ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60 ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచారు. 2014 నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు. సుదర్శన్ అనారోగ్యం కారణంగా గత కొన్నేళ్లుగా ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ రూపకల్పన బాధ్యతలను ఆయన కుమారుడు రాజ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.