రాష్ట్రం లో గంజాయి రవాణా, అమ్మకాలు పెరిగిపోయాయి. అక్రమ సంపాదన, అధిక ఆదాయం పేరుతో కార్మికులు, యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని
గంజాయి స్మగ్లర్లు గాలం విసురుతున్నారు. వారి మాయలో పడి గంజాయి విక్రయిస్తూ జిల్లా ప్రజలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి గంజాయి తీసుకువచ్చి చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అమ్మకాలు చేపడుతున్నట్లు సమాచారం.
మాదక ద్రవ్యాలకు 15 ఏళ్లకే అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గంజాయి, ఎసిప్రిన్,కొకైన్,నల్లమందు, హెరాయిన్, బ్రౌన్షుగర్, కిటామైన్ తదితర రూపాల్లో దొరికే మాదకద్రవ్యాలు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకొనే వారికి పిట్స్ వస్తుందని.. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, జీర్ణాశయం, మెదడుపై అధిక ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతు న్నారు. గంజాయి సేవించే వారిలో రక్తనాళాలు దెబ్బతిని.. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుందంటున్నారు.గుండె కొట్టుకోవడంలో వ్యత్యాసం ఏర్పడి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదమూ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే జాతీయ స్థాయి క్రైమ్ నివేదిక ప్రకారం గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని తేలింది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ నుంచి వివిధ ప్రాంతాలకు భారీగా గంజాయి తరలిపోతోంది. అయితే దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడ్డా.. మూలలకు విశాఖతో లింకులు బయడపడుతున్నాయి. తాజా కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి. గంజాయి అమ్మకాలపై అడ్డుకట్ట వేసేందుకు యానాం పోలీసులు నడుంబిగించారు. ఆంధ్రా నుండి అడ్డు అదుపు లేకుండా గంజాయి తరలిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోన్న గంజాయి ముఠాకు చెక్ పెట్టాలనుకున్నారు.
యానాం పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి ఇటీవల పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల నుంచి తమ స్టయిల్లో విచారించి గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం కక్కించారు.వాళ్లిచ్చిన సమాచారంతో మాఫియా గ్యాంగ్కు చుక్కలు చూపించారు.
యానాం ఏస్పీ బాలచంద్రన్ ఆదేశాల ప్రకారం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడువేల ఐదువందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియాముందు ప్రవేశ పెట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సోదాల్లో సీఐ శివగణేష్, క్రైం టీం పాల్గొన్నారు. కాగా గంజాయి రవాణా చేస్తూ దొరికితే భవిష్యత్ పాడవుతుందని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని యువతకు ఎస్పీ బాలచంద్రన్ సూచించారు. ఎవరైనా సరఫరా చేసినట్టు తెలిసినా.. సేవించినా కఠిన చర్యలు తప్పవని తెలియచేశారు.