ఎట్టకేలకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొత్త జాతీయ పార్టీ పేరును ఖరారు చేశారు. ఆయన జాతీయ పార్టీని ప్రకటించేందుకు తేదీ కూడా ఫిక్స్ అయ్యి, ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ అధినేత తన కొత్త జాతీయ పార్టీకి ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా నామకరణం చేయనున్నారు. చాలా పేర్లను పరిశీలించిన తరువాత ఎట్టకేలకు ఈ పేరును ఎంపిక చేసిన కేసీఆర్ దసరా పండుగ రోజున అంటే బుధవారం నాడు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్న కేసీఆర్ అదే సమయంలో ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో తాత్కాలికంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి కేటీఆర్ గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. జాతీయ కోఆర్డినేటర్ల నియామకాల్లోనూ కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. కేటీఆర్తో పాటు మాజీ సీఎంలు కుమార స్వామి, శంకర్సింగ్ వాఘేలా, సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల సమన్వయ బాధ్యతలు ప్రకాష్రాజ్కి దక్కే అవకాశం ఉంది