ఉత్తరప్రదేశ్‌లో దారుణం..రెండు గంటల వ్యవధిలో 31 మంది మృతి

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 10:44 AM

ఉత్తరప్రదేశ్‌లో దారుణం..రెండు గంటల వ్యవధిలో 31 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో శనివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 31 మంది మృతి చెందగ, 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు ప్రమాదాలు రెండు గంటల వ్యవధిలో చోటు చేసుకున్న్నాయి. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ట్రాలీ ఘటంపూర్ ప్రాంత సమీపంలో అదుపుతప్పి ఓ చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నావోలోని చంద్రిక దేవి ఆలయ సందర్శన అనంతరం భక్తులు వెనక్కి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందినప్పటికీ ఘటనా స్థలానికి పోలీసులను సకాలంలో పంపడంలో అలసత్వం వహించిన అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోపే మరో ఘటన జరిగింది. అహిర్వాన్ ఫ్లై ఓవర్ వద్ద వేగంగా వచ్చిన ఓ ట్రక్ ముందు వెళ్తున్న టెంపోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 26 మంది యాత్రికులు మృతి చెందిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడి వారికి రూ. 50 వేలు అందించనున్నట్టు తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాక్టర్ ట్రాలీలను ఉన్నది వ్యవసాయ పనుల కోసం అని, ప్రయాణాలకు వాటిని వాడొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.





Untitled Document
Advertisements