నడవలేని స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా ప్రేమించిన వాడినే పెళ్ళాడిన యువతి

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:33 PM

నడవలేని స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా ప్రేమించిన వాడినే పెళ్ళాడిన యువతి

వారిద్దరూ ఐదేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కులాలు కూడా ఒక్కటే కావడంతో పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది. అయితే వారి ప్రేమ బంధాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకునేలోపే ప్రియుడికి యాక్సిడెంట్ జరిగింది. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. అవిటివాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు అంటూ యువతి తల్లిదండ్రులు వారించారు. కానీ ప్రేమకు ఇవేవి తెలియదు కదా. అందుకే కాళ్లు లేకపోయినాకుటుంబ సభ్యులు వారించినా ఐదేళ్లుగా ప్రేమిస్తున్నవాడితోనే పెళ్లిపీటలెక్కింది. తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని వెల్లియూర్‌ లో జరిగిన​ఈ ఘటన నిష్కల్మషమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.
కేసవనేరి గ్రామానికి చెందిన ప్రకాశ్(25), వల్లియమ్మాల్​పురానికి చెందిన దివ్య(22) గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. అయితే అంతలోనే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు ప్రకాశ్‌. చెన్నై నుంచి బైక్​పై వస్తున్న అతను ప్రమాదవశాత్తూ కిందపడడంతో వెన్నెముక దెబ్బతింది. రెండు కాళ్లు చచ్చబడిపోయాయి. దీంతో మంచానికే పరిమితయ్యాడు ప్రకాశ్‌. ఇదే సమయంలో అతనితో పెళ్లి వద్దంటూ దివ్య తల్లిదండ్రులు ఆమెను వారించారు. అయితే ఇవేవీ పట్టించుకోలేదు దివ్య. ప్రేమించిన వాడితోనే నా జీవితం అంటూ తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది. ప్రకాశ్‌తోనే ఏడడుగులు నడిచింది. ఈ విషయం తెలుసుకున్న దివ్య కుటుంబ సభ్యులు ప్రకాశ్ ఇంటికి వచ్చి గొడవకు దిగారు. దివ్యను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో ప్రకాశ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దివ్య కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుని ఆమెను, తనను కలపాలని కోరుతున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కాళ్లు పోయినా ప్రియుడినే పెళ్లిచేసుకున్న దివ్యను అందరూ మెచ్చుకుంటున్నారు.





Untitled Document
Advertisements