అసలు మొదలవకుండానే భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 ఈ రోజు వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో షెడ్యూల్ చేయడం తెలిసిన విషయమే. భారత కాలమానం ప్రకారం నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ మొదలవ్వాలి. కానీ, వెల్లింగ్టన్ లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆట ఆడడం అనేది సాధ్యం కాలేదు. ఆట సంగతి పక్కన పెడితే కనీసం టాస్ కూడా పడలేదు. కాస్త వర్షం తగ్గి ఆడడానికి వీలు చిక్కితే కనీసం ఐదు ఓవర్ల ఇన్నింగ్స్ చొప్పున మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు ఎదురు చూశారు. వారు ఎంతగా ఎదురుచూసినా నిర్ణీత సమయంలో వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు తమ డ్రెస్సింగ్ రూమ్ లకే పరిమితం అయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఈ నెల 20న, మూడో మ్యాచ్ 22న జరుగుంది. క్రీడాభిమానులు మ్యాచ్ చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తూ కూర్చుంటే వరుణ దేవుడు వారి ఆశలపై వర్షపు నీరు గుమ్మరించాడు.