అవయవ దానం కొందరిని చిరస్మరణీయులను చేస్తూ.. మరికొందరు జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అవయవ దానం వల్ల ఒక్క మనిషి పదుల సంఖ్యలో జీవితాలను నిలబెట్టవచ్చు. గుండె, మూత్రపిండం, కాలేయం, పాంక్రియాస్, చేతులు, ముఖం, కళ్లు, ఎముక మూలుగ, కణాలు ఇలా దాదాపు 200 అవయవాలు దానం చేయవచ్చు. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబడటమే కాకుండా చనిపోయిన వారు జీవించినట్లు ఉంటుంది. అమ్మ మనకు జన్మనిస్తే అవయవ దానం అనేది 8 మందికి పునర్జన్మనిస్తుంది. మనిషి తన జీవం కోల్పోయాక శరీరంలో ఉండే అవయవాలు మట్టిలో కలిసిపోయే దానికంటే వాటిని దానం చేయడం వలన మరో ఎనిమిది మందికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం. అలా మన ప్రాణం పోయినా సరే మన అవయవాల వల్ల ఇంకో ఎనిమిది మందిని బ్రతికించిన వాళ్ళం అవుతాం. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఏపీ జీవన్ దాన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవన్ దాన్ సమన్వయకర్త మరియు వీమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు జాతీయ అవయవధానం దినోత్సవం పురస్కరించుకొని కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రిలో అవయవదానం శిక్షణ కార్యక్రమం చేపట్టారు. కావున డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లక్షల మంది అవయవాలు అందుబాటులో లేక మరణిస్తున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆపై మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఆ ప్రయాణ సమయంలో బ్రెయిన్ డెడ్ గా మారి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో వారి కుటుంబాలకు బంధువులకు అవయవ దానంపై అవగాహన కల్పించి అవయవాలు దానం చేసేలా కృషి చేయాలని తెలిపారు.
అలాగే ఒక మనిషి మరణించినప్పుడు అతడు అవయవాలు దానం చేస్తే మరో ఎనిమిది మంది ప్రాణాలు కాపాడగలరు. కోవిడ్ 19 మహమ్మారి కాలంలో అనేకమంది ఊపిరితిత్తులు పాడైమరణించారు. అలాంటి విపత్కర సమయాలలో ఈ అవయవాల వల్ల వారి ప్రాణాలను కాపాడేందుకు 99% అవకాశం ఉందన్నారు. మనిషి బ్రెయిన్ డెడ్ తో మరణించిన అనంతరం వారి అవయవాలు దానం చేసిన వాటి వల్ల మరో ఎనిమిదికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతామని తెలిపారు. అదేవిధంగా మనం చనిపోయిన కూడా మన అవయవాలు దానం చేయడం వల్ల మనం బ్రతికే ఉంటామని ఆలోచన ధోరణితో అందరూ ఈ అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
అయితే ఎంతోమంది చిన్నారులు వాళ్ల చిన్నతనంలోనే అనేక లోపాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి మనం భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతామని తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవయవాల దానం కోసం ప్రత్యేకంగా జీవనధాన్ అనే సంస్థను ఏర్పాటు చేసిందని దీంట్లో రోగులు అవయవాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అలాగే అవయవాల దానం కోసం కూడా స్వచ్ఛందంగా తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఈ ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అవయవ దానంపై ఉన్నటువంటి మూఢనమ్మకాలను వదిలి ప్రాణదాతలుగా మారాలని విజ్ఞప్తి చేశారు.