ఆవులను దత్తత తీసుకున్న కన్నడ స్టార్ హీరో సుదీప్..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 11:54 AM

ఆవులను దత్తత తీసుకున్న కన్నడ స్టార్ హీరో సుదీప్..

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఒక పుణ్యకార్యంలో భాగస్వామి అయ్యారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పుణ్యకోటి దత్తు యోజన’ కార్యక్రమంలో కిచ్చా సుదీప్ పాలుపంచుకుంటున్నారు. ఈ పథకానికి ఆయన అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు. తాను 31 ఆవులను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కర్ణాటకలోని ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఆవును ఆయన దత్తత తీసుకోనున్నారు.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, తాను 31 ఆవులను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పుణ్యకోటి దత్తు యోజన కింద కర్ణాటకలోని ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఆవును దత్తత తీసుకోబోతున్నట్టు గురువారం ఆయన చెప్పారు. అక్రమ రవాణా, పశువధ నుంచి గోవులను కాపాడటమే ధ్యేయంగా కర్ణాటక ప్రభుత్వం ‘పుణ్యకోటి దత్తు యోజన’పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రజల సహకారంతో గోశాలలను ఏర్పాటుచేసి, ఆర్థికంగా వాటిని నిలబెట్టడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకానికి కిచ్చా సుదీప్‌కు అంబాసిడర్‌గా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు బి చౌహన్ ఇంటి వద్ద గురువారం సుదీప్ ‘గో పూజ’నిర్వహించారు. ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ మాట్లాడుతూ గోవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎంతో అద్భుతంగా పనిచేస్తోందని కొనియాడారు. ‘‘పుణ్యకోటి దత్తు యోజన పథకానికి నన్ను అంబాసిడర్‌గా నియమించి ప్రభుత్వం నా బాధ్యతలను మరింత పెంచింది. నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మంత్రి ప్రభు చౌహన్‌కు ధన్యవాదాలు’’ అని సుదీప్ అన్నారు. అంతేకాదు, గోవులను దత్తత తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు, సినీ పరిశ్రమలోని నటీనటులకు సుదీప్ పిలుపునిచ్చారు.
కర్ణాటక ప్రభుత్వం తనను ‘పుణ్యకోటి దత్తు యోజన’ పథకానికి అంబాసిడర్‌గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ కిచ్చా సుదీప్ ట్వీట్ కూడా చేశారు. ‘‘పుణ్యకోటి రాయబారి అయినందుకు గర్విస్తున్నాను. జిల్లాల వారీగా 31 ఆవులను దత్తత తీసుకుంటున్నాను. ఈ గౌరవం, అవకాశాన్ని నాకు కల్పించిన కర్ణాటక ప్రభుత్వానికి, మంత్రి ప్రభు చౌహాన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ట్వీట్‌లో కిచ్చా సుదీప్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన పుట్టినరోజు సందర్భంగా 11 ఆవులను దత్తత తీసుకున్నారు. అప్పుడే తన కలల ప్రాజెక్ట్ అయిన ఆవుల దత్తత కార్యక్రమం ‘పుణ్యకోటి’ని ప్రారంభించారు. అప్పుడు మంత్రి ప్రభు చౌహన్ తాను 31 ఆవులను దత్తత తీసుకోనున్నట్టు ప్రకటించారు. ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఆవును దత్తత తీసుకుంటానని అన్నారు. ఇప్పుడు మంత్రి మాదిరిగానే తాను కూడా 31 ఆవులను దత్తత తీసుకుంటున్నానని హీరో కిచ్చా సుదీప్ ప్రకటించారు. ఇక సుదీప్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఈ ఏడాది ‘విక్రాంత్ రోణ’ అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఉపేంద్రతో కలిసి ‘కబ్జా’ అనే పాన్ ఇండియా మూవీలో సుదీప్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శ్రియ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements