తెలంగాణ ప్రజల పల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 02:07 PM

తెలంగాణ ప్రజల పల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి..

తెలంగాణ రాష్ట్రం పై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ చేస్తున్నారా.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధానికి ఇది ఒక కారణమా.. తెలంగాణా రాష్ట్రంలో అధికారంపై బీజేపీ హైకమాండ్ బోలెడు ఆశలు పెట్టుకుందా.. తెలంగాణ రాష్ట్రంపై ఈ క్రమంలోనే అమిత్ షా దృష్టి సారించారా.. అంటే తాజాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అవును అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది.
తెలంగాణ ప్రజల పల్స్ తనకు తెలుసని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ దే అధికారం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను తప్పకుండా తెలంగాణకు వెళ్తానని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అమిత్ షా పేర్కొన్నారు. అలాగే దేశంలో మరోసారి ప్రధాని మోదీ న్యాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టైమ్స్ నౌ సమ్మిట్ 2022లో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే తెలంగాణలోని కింది స్థాయి ప్రజల వరకు వాళ్ల నాడి నాకు తెలుసని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికలకు ముందు నేను తెలంగాణ కు వెళ్లి అక్కడే ఉండి బీజేపీని గెలిపిచ్చుకుంటానని అన్నారు. బీజేపీ సౌత్ ఎంట్రీకి తెలంగాణ గేట్ వే లాంటిదని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీది అవుతుందని జోస్యం చెప్పుకొచ్చారు. కాగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే బీజేపీ రోజురోజుకు తన బలాన్ని పెంచుకుంటుంది. ఇతర పార్టీల్లో బలమైన నాయకులు ఒక్కొక్కరు కాషాయ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ సినియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ ఆకర్ష్ లో భాగంగా మరింతమంది కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల బీజేపీ శిక్షణా తరగతులు నిర్వహించింది. మరోవైపు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో ఎన్నికలు వచ్చే వరకు ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. 28న ఈ యాత్ర ప్రారంభం కానుంది.
కావున తెలంగాణలో ఓ వైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పార్టీ బలోపేతంపై మాట్లాడుతున్నట్టు సమాచారం.





Untitled Document
Advertisements