దళితబందు లబ్దిపొంది యూనిట్ ప్రారంభించని వారికి ముఖ్య గమనిక..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 04:03 PM

దళితబందు లబ్దిపొంది యూనిట్ ప్రారంభించని వారికి ముఖ్య గమనిక..

శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే దళిత బంధు. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ద్వారా దళితులు ఎంట్రప్రెన్యూర్లుగా మారనున్నారు. దేశంలో ఉన్న ప్రస్తుత అన్ని స్కీమ్‌లలో కెల్లా అతిపెద్ద నగదు బదిలీ పథకం ఇదే కావడం విశేషం. ఈ స్కీమ్‌ పైలట్ ప్రాజెక్టు హుజురాబాద్‌లో ప్రారంభమైంది. అయితే గత సంవత్సరం ఆగస్టు నెలలో పైలెట్ ప్రాజెక్టు కింద దళిత బందు పథకం హుజురాబాద్ లో సీఎం కెసిఆర్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. చిన్న చిన్న అటు పోటుల మధ్య ఇప్పటివరకు అర్హులైన దళితులకు దళిత బంధు అందరికి చేరే దిశగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి అర్హులైన దళితులకు దళిత బందు రాకపోవడంతో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తునే ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు అసలు కథ మొదలైంది. దళితబంధు పథకం ద్వారా లబ్దిపొంది యూనిట్ ప్రారంభించని వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్జన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధు యూనిట్ల మంజూరీపై సంబంధిత క్లస్టర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
కాగా ఈ సందర్భంగా కలెక్టర్ కర్జన్ మాట్లాడుతూ.. జిల్లాలో దళితబంధు పథకం ద్వారా లబ్ధిని పొంది యూనిట్లను స్థాపించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిరించేవారికి నోటీసులను జారీ చేయాలని, అప్పటికీ స్పందించకపోతే దళితబంధును రద్దు చేయాలని తెలిపారు. యూనిట్ల మంజూరులో అధికారులు పరిశీలించిన తరువాతే తదుపరి అనుమతులు ఇవ్వాలని, యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ కెఎస్ సర్వేలో ఉండి ప్రస్తుతం కూడా ఉన్నవారికి, రేషన్ కార్డు ఉన్నవారికి పథకం మంజూరుకు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారులుగా జీవించేవారికి, వృద్ధులకు, మనవండ్లు, మనవరాళ్లకు పథకం మంజూరు చేయరాదని సూచించారు. కాని తక్కువ ఆదాయం ఉన్న రిటైర్డు ఉద్యోగులకు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వారికి పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. సరైన పత్రాలను, ఆధారాలను చూపించనివారి దరఖాస్తు తిరస్కరించే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. దళిత బంధు పథకం స్టార్ట్ అయి సంవత్సర పూర్తయిన కూడా.. దళిత బందు తీసుకున్న లబ్ధిదారులు చాలామంది వారికి కేటాయించిన యూనిట్లను ప్రారంభించకపోవడంతో అలాంటి వారిపై యాక్షన్ తీసుకొని కేసులు పెట్టాలని.. జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. చాలా మంది దళిత బందు లబ్ధిదారులు డబ్బులను సొంత అవసరాలకు వినియోగించుకుంటూ.. దళిత బంధు డబ్బులను పక్కదోవ పట్టిస్తున్నారని..పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వీటిపైన స్పందించిన జిల్లా కలెక్టర్ ఎవరైతే లబ్ధిదారులు యూనిట్లను ప్రారంభించలేదో వారి పైన తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు సూచించారు.





Untitled Document
Advertisements