గొప్ప ఆదరణ పొందినప్పుడు సీక్వెల్ తీయకుండా ఉంటామా? మేమంతా అదే పనిలో ఉన్నాం.. జక్కన్న

     Written by : smtv Desk | Wed, Jan 11, 2023, 01:35 PM

 గొప్ప ఆదరణ పొందినప్పుడు సీక్వెల్ తీయకుండా ఉంటామా? మేమంతా అదే పనిలో ఉన్నాం.. జక్కన్న

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ ఆర్’ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లోనూ అఖండ విజయం సాధించింది. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం తన సత్తా చాటింది. ఈ చిత్రం విడుదలై ఏడాది దాటినా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎన్నో అవార్డులు వస్తున్నాయి. తాజాగా ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ను దక్కించుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ప్రస్తావించారు. చిత్రాన్ని కొనసాగించేందుకు ఓ అద్భుతమైన ఆలోచన తట్టిందని ప్రకటించారు. దాన్ని స్ర్కిప్టుగా డెవలప్ చేసే పనిలో ఉన్నట్టు ధ్రువీకరించారు.

‘సినిమా విడుదలై ఇంత గొప్ప ఆదరణ పొందినప్పుడు, మేము సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది. మాకు కొన్ని మంచి ఐడియాలు వచ్చాయి. అయితే బలవంతంగా సీక్వెల్ తీయకూడదని అనుకున్నాం. ఆ తర్వాత, పాశ్చాత్య దేశాల్లోనూ ఆర్ఆర్ ఆర్ కు మంచి ఆదరణ చూసిన తర్వాత కొన్ని వారాల క్రితం మా నాన్న, మా కజిన్‌తో (రచన బృందంలో భాగమైన వారితో) మళ్లీ చర్చించా. అప్పుడు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆధారంగా వెంటనే కథ రాయడం ప్రారంభించాం. అయితే, స్క్రిప్ట్ పూర్తయ్యేదాకా సీక్వెల్ విషయంలో మేం ముందుకెళ్లలేం. ప్రస్తుతం మేమంతా అదే పనిలో ఉన్నాం’ అని రాజమౌళి వెల్లడించారు.





Untitled Document
Advertisements