నీరు మన శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం అనే విషయం అందరికి తెలిసిందే. అయితే నీరు తాగమన్నారు కదా అని ఏ నీటిని పడితే ఆ నీటిని తాగకూడదు. అలా తాగితే అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శుబ్రమైన మంచి నీరు మాత్రమే తాగాలి. ఇంకా మీకు కుదిరితే నీటిని మరగకాచి త్రాగమని చెబుతారు మన పెద్దవారు. ఎందుకంటే నీటిలో ఎన్నో రకాల క్రిమి కీటకాలు ఉంటాయి. మనము నీరు అలానే త్రాగేస్తే అందులో ఉన్న ఆ క్రిముల వల్ల అనారోగ్యం భారిన పడే అవకాశం ఉంటుంది. మనం నీటిని మరగబెడితే అవి నాశనం అవుతాయి అందుకోరకే మరగకాచిన నీటిని త్రాగమని చెబుతారు. కానీ అలా మరగకాచిన నీటి రుచి చప్పగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అనే సందేహం అందరికి వస్తుంది. అయితే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము..
మనము త్రాగే నీటిలో కొన్ని లవణాలు ఉండటం వలన వాటికీ రుచి వస్తుంది. నీటి రుచి ఎందుకు, ఎలా ఏర్పడుతుందంటే వర్షపు నీరు మేఘాలలో నుంచి కిందకు పడే లోపుగా వాతావరణంలో కార్బన్ డై అక్సైడ్ వాయువును పీల్చుకుంటుంది. ఆ నీరు భూమి మీద పడి లోపల పొరలలో చోచుకోనిపోయినప్పుడు సున్నపు రాతి పొరలలో ఉంటూ, ఇంకా కరగని కాల్షియం కార్బోనేట్ కరిగే బై కార్బోనేట్ గా మార్చి తనలో విలీనం చేసుకుంటుంది. బై కార్బోనేట్ లవణం ద్వారా నీటికి ఒక రుచి ఏర్పడుతుంది. నీటిలో కరిగి ఉన్న కార్బన్ డై ఆక్సైడ్, నీటిని శుభ్రం చేసేందుకు వాడె క్లోరిన్ మొదలైనవి కూడా నీటికి రుచి కల్పిస్తాయి. నీటిని మరగకాచినపుడు అందులోని వాయువులు బయటకు వెళ్ళిపోతాయి. కనుక మరగ కాచి చల్లార్చిన నీరు రుచిని కోల్పోతుంది.