ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య రాజకీయ నాయకులు సినిమాల గురించి తరుచుగా ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయ నాయాలు సినిమాల పై చేసిన వాఖ్యాలను మీడియా హైలెట్ చేస్తోందని, వారు చేసిన కామెంట్స్ నే టీవీలు రోజంతా ప్రసారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పేర్కొన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఈమేరకు ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న మోదీ.. మంగళవారం పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అనవసర వ్యాఖ్యలు చేసి ప్రచారంలో ఉండొద్దని హితవు పలికారు.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమాపై వివాదం రేగడం తెలిసిందే! ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని పలువురు నాయకులు, ఇతర సంఘాలు పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో హీరోయిన్ కాషాయ రంగు దుస్తులు ధరించడంపై బీజేపీ నేతలు పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వంటి నేతలు చేసిన వ్యాఖ్యలను మీడియా హైలెట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తాజాగా పార్టీ నేతలకు సూచనలు చేసినట్లు సమాచారం. మరి ప్రధాని వాఖ్యలను ఆ పార్టీ నేతలు ఏ మేరకు ఫాలో అవుతారు అనేది వేచి చూడాలి.