హిందుత్వ పార్టీ అనే ముద్ర నుండి బయట పై ప్రయత్నంలో బీజేపీ !

     Written by : smtv Desk | Tue, Jan 24, 2023, 01:14 PM

హిందుత్వ పార్టీ అనే ముద్ర నుండి బయట పై ప్రయత్నంలో బీజేపీ !

బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అనే ముద్ర ఒకటి ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీని హిందుత్వ పార్టీగానే చూస్తుంటాయి.

బీజేపీ అనగానే అది హిందుత్వ పార్టీ అనే బలమైన ముద్ర పడిపోయింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా బీజేపీని హిందుత్వ పార్టీగానే చూస్తాయి. అయితే తాజా ఆ పార్టీ పై పడిన హిందుత్వం అనే ముద్ర చెరిపేసుకునేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలకు చేరువ కావడం ద్వారా ఈ మత ముద్రను తొలగించుకునే వ్యూహాలు అమలు చేయనుంది.

సామాజిక సంక్షేమ పథకాల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించాలంటూ కేడర్ కు బీజేపీ అధిష్ఠానం సూచించింది. తద్వారా మత ప్రాతిపదికన వారి పట్ల ఎటువంటి వివక్ష లేదన్నది ఎత్తి చూపించాలనే ఆదేశాలు క్షేత్రస్థాయి వరకు వెళ్లాయి. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ముస్లింలు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధాన లబ్ధిదారులుగా ఉండడం ఆయా ఆరోపణలకు చెక్ పెడుతుందని బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు.

‘‘బ్యాలట్ రూపంలో మైనారిటీలు మద్దతుగా నిలవకపోయినా సరే, వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోకూడదని బీజేపీ కోరుకుంటోంది. వారు కోరుకున్న పార్టీకి ఓటు వేసుకోవచ్చు. కానీ, ఎవరికి ఓటు వేయాలనే వారి నిర్ణయాన్ని బీజేపీ పట్ల ద్వేష భావన కారణం కాకూడదు’’అని సదరు బీజేపీ నేత వివరించారు.

ఆర్థికంగా, సామాజికంగా ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు చేరువ కావాలంటూ బీజేపీ కేడర్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి నేషల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల సందర్భంగా పిలుపునివ్వడం గమనార్హం. ముస్లింలలోనూ వెనుకబడిన వర్గాలు ఎన్నో ఉన్నాయి. వీరిని పస్మందాగా పిలుస్తారు. ఎలక్టోరల్ పాలిటిక్స్ కోణంలో కాకుండా, ఆయా వర్గాలకు సన్నిహితం కావాలని ప్రధాని కోరారు. బోహ్రా ముస్లింలు బీజేపీకి వ్యతిరేకం కారన్న ఉదాహరణను ఆయన ప్రస్తావించారు.

ఫిబ్రవరి 10 నుంచి బీజేపీ మైనారిటీ మోర్చా విభాగం దేశవ్యాప్తంగా 60 లోక్ సభ స్థానాల పరిధిలో 5,000 మందిని గుర్తించనుంది. వీరి సాయంతో మైనారిటీ వర్గాలకు బీజేపీ చేరువ అయ్యే ప్రయత్నాలు చేయనుంది. ముస్లిం జనాభా 30 శాతం కంటే ఎక్కువ ఉన్న 30 నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నట్టు సదరు బీజేపీ నేత వెల్లడించారు. ‘‘కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆవాస్ యోజన, హర్ ఘర్ నాల్, స్కాలర్ షిప్ లు, ఆయుష్మాన్ భారత్ పథకాల్లో ఎంత మంది ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నారనే వాస్తవాలను ముస్లింలకు వివరించనున్నాం’’అని బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమల్ సిద్దిఖి తెలిపారు. ముందుగా బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్మూ అండ్ కశ్మీర్ లో ఈ కార్యక్రమాలను బీజేపీ మైనారిటీ మోర్చా చేపట్టనుంది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరించనుంది.





Untitled Document
Advertisements