దేశ ఆర్ధిక వ్యవస్థ పై విచిత్ర వాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి

     Written by : smtv Desk | Sat, Jan 28, 2023, 12:12 PM

దేశ ఆర్ధిక వ్యవస్థ పై విచిత్ర వాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి

దాయాది దేశం పాకిస్థాన్ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశం ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యి కొట్టుమిట్టాడుతుండగా ఆ దేశ ఆర్థిక మంత్రి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం పేరుమీద ఏర్పడిన దేశం తమదని, దేశాన్ని కాపాడే బాధ్యత అల్లాదేనని అన్నారు. పాకిస్థాన్ ను సృష్టించింది అల్లా.. దేశాన్ని కాపాడడం, అభివృద్ధి చేయడంతో పాటు సంపన్న దేశంగా మార్చాల్సిన బాధ్యత కూడా అల్లాదేనని చెప్పారు. అదే సమయంలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాని నేతృత్వంలో తామంతా రాత్రింబగళ్లు కష్టపడుతున్నామని పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ చెప్పారు.

ఇస్లామాబాద్ లో శుక్రవారం గ్రీన్ లేన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ సర్వీసును మంత్రి ఇషాక్ దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి కారణం గత ప్రభుత్వ నిర్ణయాలేనని చెప్పారు. నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్న కాలం (2013-2017) లో పాక్ ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగా ఉండేదని తెలిపారు. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

ఆ నిర్ణయాల వల్ల ఏర్పడిన ఇబ్బందులను ఇప్పుడు ఒక్కొక్కటిగా తీరుస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో రాత్రీపగలూ కష్టపడుతున్నామని పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ హయాంలో అభివృద్ధి వైపు నడిచిన దేశం ఇప్పుడు పట్టాలు తప్పిందని ఇషాక్ దార్ ఆరోపించారు. అప్పట్లో పాకిస్థాన్ స్టాక్ ఎక్ఛేంజ్ దక్షిణాసియాలోనే బెస్ట్ ఎక్ఛేంజ్ గా ఉండేదని, 5వ ర్యాంకు సాధించిందని మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు ఇప్పుడు కళ్లారా చూస్తున్నారని పేర్కొంటూ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనను విమర్శించారు.





Untitled Document
Advertisements