జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

     Written by : smtv Desk | Tue, Jan 31, 2023, 05:19 PM

జగన్  వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

ఢిల్లీలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొన్న జగన్ ఏపీ రాజధాని విశాఖపట్నం అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా సీఎం జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
విశాఖ రాజధాని కాబోతోందని ఢిల్లీ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారని, కోర్టు పరిధిలోని అంశంపై ప్రకటన సరికాదని, తన ఆఫీసును తరలిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పడం అభ్యంతరకరమని అన్నారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రికి రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవంలేదని అర్థమవుతోందని సత్యకుమార్ విమర్శించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇవాళ రాజధానిపై జగన్ ప్రకటన చేశారని సత్యకుమార్ ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి ఒక్క పైసా పెట్టుబడి కానీ, పరిశ్రమ కానీ తీసుకురాలేకపోయారని వ్యాఖ్యానించారు. సీఎంకి ప్రజాదరణ తగ్గిందని ఇండియాటుడే సర్వేలో తేలిందని వెల్లడించారు. వివేకా హత్యలో కుటుంబ సభ్యుల ప్రమేయంపై వార్తలు వచ్చాయని అన్నారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు వివాదాలు సృష్టించడం జగన్ కు అలవాటేనని సత్యకుమార్ విమర్శించారు.





Untitled Document
Advertisements