ప్రభుత్వ ఆదాయ మార్గాలు ఇవే!

     Written by : smtv Desk | Wed, Feb 01, 2023, 11:10 AM

ప్రభుత్వ ఆదాయ మార్గాలు ఇవే!


ప్రతి సంవత్సరం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టి వివిధ శాఖలకు కేటాయింపుల వివరాలు ప్రకటిస్తుంటుంది. ఏటా సుమారు 35 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతోంది. మరి ప్రభుత్వం ప్రవేశ పెట్టె ఈ బడ్జెట్ కు నిధులు ఎక్కడి నుండి సమకూరుతాయి అనే విషయం తెలుసుకుందాం
గతేడాది బడ్జెట్ లెక్కలు చూస్తే.. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ప్రతీ రూపాయిలో సుమారు 18 పైసలు కార్పొరేట్ ట్యాక్సు నుంచేనని తెలుస్తోంది. ఇక ఆదాయ పన్ను శాఖ ద్వారా 17 పైసలు వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కార్పొరేట్ ట్యాక్స్, ఇన్ కం ట్యాక్స్ ల ద్వారా వచ్చే సొమ్ము నేరుగా ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది. పరోక్ష పన్నుల విషయానికి వస్తే.. జీఎస్టీ ద్వారా 18 పైసలు (ప్రభుత్వానికి వచ్చే ప్రతీ రూపాయిలో), సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 7 పైసలు, కస్టమ్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి 4 పైసల ఆదాయం వచ్చింది.

ఈ పన్నులు మాత్రమే కాకుండా వివిధ పన్నేతర ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం అందించే టెలిఫోన్, గ్యాస్, పెట్రోల్, విద్యుత్ తదితర సేవలకు గానూ ఫీజులు, సెస్సుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థలు ఆర్జించే లాభాల్లో వాటా, ఖనిజాల అమ్మకం, గనుల లైసెన్సులు, రాయల్టీలు, టోల్ గేట్, పాస్ పోర్ట్ సేవలు, విదేశీయులకు జారీచేసే వీసాలకు ఫీజులు తదితర రూపాల్లో ఆదాయం వస్తుంది.

విదేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇచ్చిన అప్పులకు వడ్డీ, రుణాల వసూలు ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వ ఖజానా నిండుతుంది. ప్రభుత్వ రంగంలోని సంస్థల అమ్మకం, వాటాల విక్రయం, కొత్త కంపెనీల షేర్లను అమ్మడం ద్వారా కేంద్రం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ప్రజలకు బాండ్ల అమ్మకం ద్వారా, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం సొమ్ము సమకూర్చుకుంటుంది.





Untitled Document
Advertisements