నేడు తెలంగాణా రాష్ట్రలో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. నేడు మొదలైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అధికార పక్ష మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ ల వద్దకు వచ్చారు. పలు అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. హుజూరాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించారు. పిలిస్తే కదా హాజరయ్యేది అంటూ ఈటల సమాధానమిచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రాక్టీస్ సరిగా లేదని చెప్పారు.
మరోవైపు సభకు రాజాసింగ్ కాషాయం రంగు చొక్కా వేసుకొచ్చారు. చొక్కారంగు కళ్లకు గుచ్చుకుంటోందని, ఈ రంగు తనకు ఇష్టం ఉండదని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో మీరు కూడా కాషాయం రంగు వేసుకోవచ్చేమో అంటూ రాజాసింగ్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఈలోగా గవర్నర్ వస్తున్నారంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేటీఆర్ కు చెప్పారు. దీంతో ఆయన తమ స్థానాల వైపు వెళ్లిపోయారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు సైతం సభ ప్రారంభానికి ముందు ఈటల వద్దకు వచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. కొంతకాలంగా ఉప్పు నిప్పుల వ్యవహరించిన వారు ఉన్నట్టుండి ఈటెలను కలవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనే చర్చలు మొదలయ్యాయి.