మంచు మోహన్ బాబు తనయుడు సినీ హీరో మంచు మనోజ్ మొదటి భార్య నుండి విడిపోయిన తరువాత చాలాకాలం ఒంటరిగా ఉన్నారు. అయితే తాజగా మనోజ్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాడు. దివంగత రాజకీయ నేతలైన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డిని ఆయన పెళ్లాడబోతున్నాడు. వీరి వివాహం ఈ రాత్రి 8.30 గంటలకు జరగనుంది.
ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య మౌనిక ఫొటోను సోషల్ మీడియాలో మనోజ్ పోస్ట్ చేశాడు. 'పెళ్లికూతురు భూమా మౌనిక' అని ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన సినీ ప్రియులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ పెళ్లి జరుగనుంది. పెళ్లి వేడుక మొత్తం మంచు లక్ష్మి చేతుల మీదుగానే జరగనున్నట్టు సమాచారం. ఇరు కుటుంబ సభ్యులతో పాటు, అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లి జరగనుంది.
మనోజ్ కు 2015లో ప్రణతీరెడ్డితో పెళ్లి జరిగింది. అయితే 2019లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు తన స్నేహితురాలు మౌనికను ఆయన వివాహం చేసుకోబోతున్నాడు. మరోవైపు, మౌనికకు కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం.