10 ఏళ్లకు ఓసారి అధార్ అప్ డేట్ తప్పనిసరి.. ఈ మూడు నెలలు ఫ్రీ

     Written by : smtv Desk | Thu, Mar 16, 2023, 11:02 AM

10 ఏళ్లకు ఓసారి అధార్ అప్ డేట్ తప్పనిసరి.. ఈ మూడు నెలలు ఫ్రీ

ఆధార్ సామాన్యుడి గుర్తింపు. ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగానికి చెందిన ఏ విధమైన సేవలు కావలన్నా కూడా ఈ ఆధార్ అనేది తప్పని సరి. అయితే ఈ గుర్తింపు కార్డుని ఒక్కసారి తీసుకుంటే జీవితకాలం మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన పనిలేదు అనుకుంటారు మనలో చాలా మంది. కానీ తప్పు ఆలోచన ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటితే ఆధార్ అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి.
ఇందుకోసం రూ.25 ఫీజుగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వసూలు చేస్తోంది. తాజాగా ఆధార్ అప్ డేట్ చేసుకునే వారికి యూఐడీఏఐ కొంత వెసులుబాటు కల్పించింది. ఆధార్ అప్ డేషన్ కోసం ఎలాంటి ఫీజూ వసూలు చేయకూడదని నిర్ణయించింది. అయితే, ఈ అవకాశం 3 నెలల వరకు మాత్రమేనని తేల్చిచెప్పింది.

యూఐడీఏఐ అధికారుల ప్రకారం.. మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఆధార్ అప్ డేషన్ ఉచితంగా చేసుకోవచ్చు. అవసరమైన గుర్తింపు పత్రాలతో ఆధార్ పోర్టల్ ద్వారా ఈ అప్ డేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. ఉచిత సేవలు ‘మై ఆధార్ పోర్టల్’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే, పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇతరత్రా సేవలకు చార్జీలు చెల్లించాల్సిందే!

ఉచిత సదుపాయం కేవలం ఆధార్ అప్ డేషన్ కు మాత్రమేనని అధికారులు వివరించారు. ఈ నిర్ణయంతో లక్షలాది ప్రజలు లబ్ది పొందుతారని పేర్కొన్నారు. ఉచిత అప్ డేషన్ గడువు ముగిశాక రూ.50 చెల్లించి ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆధార్ కార్డును ప్రతీ పదేళ్లకు ఓమారు అప్ డేట్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements