వైసీపీకి టీడీపీ సవాల్.. ఆ వీడియో ఎడిట్ చేయకుండా విడుదల చేయండి

     Written by : smtv Desk | Mon, Mar 20, 2023, 03:04 PM

వైసీపీకి టీడీపీ సవాల్.. ఆ వీడియో ఎడిట్ చేయకుండా విడుదల చేయండి

రాజకీయాలు అన్న తరువాత ఒకరిపై ఒకరు మాటలు విసురుకోవడం సహజం. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కయ్యానికి కాలు దువ్వుతూ, కవ్విస్తూ మినీ యుద్దమే చేస్తారు. అయితే ఇదంతా కూడా కేవలం మాటలతోనే. కానీ ఈ రోజు ఏపీ అసెంబ్లీలో ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ సభ్యులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో సభలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో టీడీపీ ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బెందాళం అశోక్, ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే సభలో జరిగిన ఘటన సన్నివేశాలను ఎడిట్ చేయకుండా విడుదల చేయాలని సవాల్ విసిరారు.

బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. తనపై వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని చెప్పారు. స్పీకర్ పోడియం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దాడికి పాల్పడ్డారని అన్నారు. శాసనసభను కౌరవసభగా మార్చేశారని మండిపడ్డారు. తమపై దాడి చేసి.. తామే వారిపై దాడి చేసినట్టు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. స్పీకర్ పై తాను అనుచితంగా ప్రవర్తించినట్టైతే తనకు ఏ శిక్ష విధించినా కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును పక్కదోవ పట్టించేందుకే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని మండిపడ్డారు. స్పీకర్ సమక్షంలోనే తనపై దాడి చేశారని.. వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





Untitled Document
Advertisements