రూ.2000 నోటు కేవలం వారికి మాత్రమే ఉపయోగపడింది.. చిదంబరం

     Written by : smtv Desk | Mon, May 22, 2023, 03:39 PM

రూ.2000 నోటు కేవలం వారికి మాత్రమే ఉపయోగపడింది.. చిదంబరం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయం రూ.2000 నోటును రద్దు చేస్తున్న విషయమే. ప్రభుత్వం ఇలా ఉన్నట్టుండి ఈ నోటును రద్దు చేసే విధమైన నిర్ణయం తీసుకోవడం అనేది ఎందుకు అనేది అందరికి అర్ధం కాని ప్రశ్నే. కేంద్రం 2016లో రూ.2000 నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నోటును రద్దు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని రోజుల కిందట ప్రకటించింది. ఆర్బీఐ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం స్పందించారు.

రూ.2000 నోటును తీసుకురావడమే ఒక తెలివితక్కువ చర్య అని, ఇప్పుడైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు సంతోషం అంటూ వ్యాఖ్యానించారు. నల్ల డబ్బు దాచుకునేవారి కోసమే ఈ పెద్ద నోటు ఉపయోగపడిందని విమర్శించారు.

ప్రస్తుతం సామాన్యుల వద్ద రూ.2000 నోట్లు లేవని, రోజువారీ అవసరాలకు రూ.2 వేల నోట్లను ఉపయోగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెద్ద నోట్లను ఉపయోగిస్తున్నది ఎవరు? అని చిదంబరం ప్రశ్నించారు.

ఎలాంటి పత్రాలు నింపాల్సిన అవసరం లేకుండా, ఐడెంటిటీ కార్డులతో పని లేకుండా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని బ్యాంకులు చెబుతున్నాయని, ఇప్పుడు కూడా నల్ల డబ్బు దాచుకున్న వారికే ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని దీన్నిబట్టే అర్థమవుతోందని తెలిపారు. సులభంగా మార్చుకోవచ్చంటూ నల్లడబ్బు దాచుకున్నవారికి బ్యాంకులు సాదర స్వాగతం పలుకుతున్నాయని చిదంబరం విమర్శించారు. మరి ఆయన వాఖ్యల్లో నిజం ఏ మేరకు ఉంది అనే విషయం తెలియాలి అంటే కొంతకాలం వరకు పరిస్థితులను చూడాల్సిందే.





Untitled Document
Advertisements