అమరావతి, మే 26 : సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన "మహానటి" సినిమాపై సర్వత్రా ప్రశంసలు వెలువడుతున్నాయి. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. తాజాగా 'మహానటి' టీమ్.. అమరావతిలోని ప్రజా దర్బార్ హాల్లో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సావిత్రి జీవితానికి సార్థకత తీసుకురావాలనే పట్టుదలతో ఈ సినిమాలో కీర్తి సురేష్ బాగా నటించారని కొనియాడారు. సావిత్రి తన జీవితంలో పడిన కష్టాలకు ఈ సినిమా అద్దం పట్టిందని ప్రశంసించారు. కష్టాల్లో కూడా ఇతరులకు సహాయపడాలనే సావిత్రి జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమన్నారు.
ఇంత అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దినందుకు నిర్మాతలు.. స్వప్న, ప్రియాంక దత్లను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపుపై ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తామన్నారు. అలాగే చిత్ర నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. 'మహానటి' సినిమాకు ప్రభుత్వం పన్నుమినహాయింపు కల్పిస్తే.. ఆ మొత్తం రాజధాని నిర్మాణానికే ఇస్తామని వెల్లడించారు. వైజయంతి మూవీస్ తరఫున రూ.50 లక్షల చెక్ను రాజధాని నిర్మాణం కోసం స్వప్న దత్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్, సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రముఖ నిర్మాత అశ్విని దత్, మిక్కీ జే మేయర్ తదితరులు పాల్గొన్నారు.