హైదరాబాద్, జూన్ 21 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో 'జల్సా', 'అత్తారింటికి దారేది' సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా 'కోబలి'. స్క్రిప్టు కూడా పూర్తయ్యిన ఈ సినిమాఎందుకో కానీ ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేశారు. 'అజ్ఞాతవాసి’ స్థానంలో ‘కోబలి’ సెట్స్పైకి వెళ్లాల్సింది. కానీ 'సర్దార్' పరాజయం తరవాత ప్రయోగం చేయడానికి ఇష్టపడని త్రివిక్రమ్ కమర్షియల్ దారిలోనే వెళ్లి 'అజ్ఞాతవాసి' తెరకెక్కించారు. అయితే ‘కోబలి’ని ఎప్పటికైనా తీస్తానని త్రివిక్రమ్ చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు అందుకు ముహూర్తం సెట్ అయ్యింది. 2020లో ‘కోబలి’ తప్పకుండా ఉంటుందని సమాచారం.
'అజ్ఞాతవాసి' వల్ల వచ్చిన నష్టాల్ని పవన్, త్రివిక్రమ్లు పూడ్చేశారు. అయినా నిర్మాతకు కొంత లోటే కనిపిస్తోంది. దాన్ని తీర్చడానికి `కోబలి`ని సెట్స్పైకి తీసుకెళ్తారట. మినిమం బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. సెట్స్, పాటలు, ఫైటింగులూ లేకుండా ఈ సినిమా రూపొందనుంది. కాబట్టి.. ఖర్చుని అదుపులో పెట్టుకోవొచ్చు. ప్రయోగాత్మకంగా కేవలం మూడు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ 2019 ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. అది పూర్తయ్యాకే `కోబలి` ఉంటుంది. 'అజ్ఞాతవాసి' ఫ్లాప్తో పవన్ – త్రివిక్రమ్ల మధ్య స్నేహం చెడిందని చాలామంది అనుకొంటున్నారు. వాళ్లకు సమాధానంగా మళ్లీ కలసి ఓ సినిమా చేయాలని పవన్, త్రివిక్రమ్ డిసైడ్ అయినట్టున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!