హైదరాబాద్, జూన్ 23 : బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కథానాయకుడిగా 'రణ్భూమి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ భల్లాలదేవుడు రానా ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం దర్శక, నిర్మాతలు ఇప్పటికే రానాను సంప్రదించినట్లు సమాచారం. శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శశాంక్ 'ధడక్' చిత్ర ప్రచారంలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ప్రచారం తర్వాత 'రణ్భూమి' చిత్ర పూర్తి స్క్రిప్టును సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని శశాంక్ ఓ సందర్భంలో అన్నారు. 'హంప్టీ శర్మకీ దుల్హనియా', 'బద్రీనాథ్ కీ దుల్హనియా' తర్వాత శశాంక్-వరుణ్ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది కావడం విశేషం. అంతా సిద్ధమైన తర్వాత నటీనటుల వివరాలు వెల్లడించనున్నారట. మరి ఈ చిత్రంలో నటించడానికి రానా అంగీకరిస్తాడో లేదో..! చూడాలి. ప్రస్తుతం రానా కంటి ఆపరేషన్ చేయించుకోనున్న విషయం తెలిసిందే.