ముంబై, జూలై 5 : జియోతో టెలికాం రంగంలో సరికొత్త విప్లవం తెచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ తర్వాత ‘జియోఫోన్’ పేరుతో ఫీచర్ ఫోన్ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ బాండ్తో పూర్తి ఉచితంగా తీసుకొచ్చిన ఈ ఫోన్ భారీ డిమాండే పలికింది. దీంతో ఈ సిరీస్లో మరో ఫోన్ను తీసుకొచ్చింది రిలయన్స్. నేడు ముంబైలోని న్యూ మెరైన్ లైన్స్లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో జరిగిన 41వ వార్షికోత్సవ సమావేశంలో ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు.ఈ సందర్భంగా 'జియోఫోన్ 2' ను ఆవిష్కరించారు. దీంతో పాటు జియోగిగా సెటాప్ బాక్స్, జియో గిగాఫైబర్ను కూడా విడుదల చేశారు.
ప్రస్తుతం రిలయన్స్ జియోలో 21.5 కోట్ల వినియోగదారులు ఉన్నారని ముకేష్ అంబానీ పేర్కొన్నారు. జియోగిగాఫైబర్ ద్వారా అందించే ఫీచర్లను ఆకాశ్, ఇషా అంబానీలు ప్రజెంటేషన్ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు. బ్రాడ్బ్యాండ్ సేవలు ఆగస్టు 15 నుంచే కస్టమర్ల ముందుకు తీసుకురానున్నట్టు ముఖేష్ అంబానీ చెప్పారు. సెటాప్బాక్స్ ద్వారా టీవీలో కూడా జియోగిగాఫైబర్ సేవలను అందించనున్నట్టు ఆకాశ్, ఇషాలు తెలిపారు. జియోగిగాఫైబర్ ద్వారా జియోటీవీ కాలింగ్ ఫీచర్ను కూడా తీసుకొచ్చారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, టీవీ కాలింగ్లు జియోగిగాఫైబర్ రెండు ముఖ్యమైన ఫీచర్లని తెలిపారు. జియో.కామ్ లేదా మైజియో ద్వారా ‘జియోగిగాఫైబర్’ సర్వీసులను రిజిస్టర్ చేసుకోవచ్చని రిలయన్స్ పేర్కొంది.
అంతేగాక.. ప్రస్తుతం ఉన్న జియోఫోన్లలో ఆగస్టు 15 నుంచి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ను అందిస్తామని ముకేష్ అంబానీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించారు. జియోఫోన్ మాన్సూన్ హంగామా పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ కింద పాత ఫీచర్ ఫోన్లను జియోఫోన్లతో ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అది కూడా కేవలం రూ. 501కే. జులై 21 నుంచి ఈ ఆఫర్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.