నాగ్ కు కరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు..

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 06:36 PM

నాగ్ కు కరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు..

హైదరాబాద్, జూలై 16 : 'కింగ్‌' నాగార్జున‌ ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నానితో 'దేవ‌దాస్‌' అనే మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లో కూడా నటించనున్నారు. 'మనం' సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో నటించారు. తాజాగా నాగ్‌ కూడా అమితాబ్‌ నటిస్తోన్న 'బ్రహ్మాస్త్ర' సినిమాలో ఓ కీలక పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌ ఓ కీ రోల్‌ను పోషించగా రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్‌లు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతోంది. ఈ షెడ్యుల్‌లో నాగార్జున పాల్గొన్నారు. షెడ్యుల్‌ పూర్తయ్యాక చిత్రబృందంతో కలిసి దిగిన ఫోటోలను నాగ్ సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు నాగ్‌.. 'చిత్రయూనిట్‌ను మిస్‌ అవుతున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ సోషల్‌ మీడియా ద్వారా నాగార్జునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. "'బ్ర‌హ్మాస్త్ర' సినిమాలో ఎంతో ప్రత్యేక‌మైన పాత్ర‌ను చేయ‌డానికి అంగీక‌రించిన నాగార్జున‌తో క‌లిసి ప‌నిచేయ‌డాన్ని ఎంతో గౌర‌వంగా భావిస్తున్నాం. మీ ప్రేమ‌కు, ఉత్సాహానికి ధ‌న్య‌వాదాలు స‌ర్‌' అని క‌ర‌ణ్‌జోహార్ ట్వీట్ చేశారు. దీనిపై నాగ్‌ స్పందిస్తూ.. కరణ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు సమాచారం.





Untitled Document
Advertisements