తెలంగాణలో సంచలనాత్మకంగా నామినేషన్లు వేసిన నియోజక వర్గం నిజమాబాద్. అయితే నిజామాబాద్ పార్లమెంట్ నియోజవర్గానికి జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధులు కోరారు. పోలింగ్ను 10 నుంచి15 రోజుల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలిని కలిసి విజ్ఞప్తి చేశారు. తమకు ఇప్పటి వరకూ గుర్తులు కేటాయించలేదని.. ప్రచారం చేసుకోవడానికి కూడా సమయం లేదని తెలిపారు.
అయితే తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని... వ్యవసాయం తప్ప ఎన్నికల వ్యవహారాలపై తమకు కనీస అవగాహన కూడా లేదని.. మాకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని వారు వివరించారు. అదేవిధంగా ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని కూడా తెలిపారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని రైతు అభ్యర్థులు డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాలను ఈసీ పరిగణనలోకి తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని కూడా బరిలో ఉన్న అభ్యర్థులు హెచ్చరించారు.