సుచిత్ర పరిధిలోని భూవివాదం విషయంగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని, ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బషీరాబాద్ పోలీసులు మామ, అల్లుడు ఇద్దరిని స్టేషన్కు తరలించారు. తాను కొనుగోలు చేసిన భూమిని మరొకరు ఆక్రమించారని మల్లారెడ్డి ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపుతప్పే పరిస్థితి ఉండటంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 లో భూవివాదం ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు మరికొంత మంది స్థానికుల మధ్య ఈ వివాదం నడుస్తోంది. సర్వే నెంబర్ 82 లోని రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అయితే అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని చెప్పారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెబుతున్నారు. మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది ఆరోపిస్తున్నారు.