నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ స్థానాల వివాదంపై ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం సచివాలయంలో హెచ్ బ్లాక్లో మీడియాతో మాట్లాడుతూ...మొత్తం 27,185 బ్యాలెట్ యూనిట్లు, 3530 కంట్రోల్ యూనిట్లు, 3651 వివిప్యాట్లు నిజామాబాద్కు చేరుకున్నాయన్నారు. ఒక్కొ పోలింగ్ కేంద్రం లో 12 బ్యాలెట్ యూనిట్లు పెడుతున్నందున ఓటరు గందరగోళానికి గురి కాకుండా ఎల్ ఆకారంలో అమర్చనున్నట్లు తెలిపారు. దీంతో ఓటు వేసిన వెంటనే 7 సెకన్లలో ఓటరు సులువుగా వివిప్యాట్లో గుర్తును సరిచూసుకోవచ్చునన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా పూర్తి చేసి, చరిత్రలో నిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాల్లో కలిపి మొత్తం 1788 పోలింగ్ కేంద్రా లు ఉన్నాయి. ప్రతి కేంద్రంలోనూ నమూనా బ్యాలెట్ యూనిట్లను, అభ్యర్థుల ఫోటోలతో ప్రదర్శిస్తామన్నారు. ఓటరు క్యూ లైన్లో ఉన్నపుడే చూసుకునే వెసులుబాటు ఉంటుందని, ఫలితంగా ఇబ్బంది లేకుండా ఓటు వేయవచ్చునని స్పష్టం చేశారు. 24గంటలు పనిచేస్తున్నామని, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్లు రెట్టింపు సంఖ్యలో అందుబాటులో ఉంచుకుంటున్నామని, ఏదైనా సమస్య వస్తే వెంటనే మార్చి పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.