పెద్దపల్లి: తెలంగాణ వీరప్పన్ గా పిలవబడే కలప స్మగ్లర్ శ్రీనును తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. గత 20 సంవత్సరాలుగా కలప అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు దొరకకుండా తిరుగుతన్న శ్రీనివాస్ అలియాస్ పోతారం శ్రీనుతో పాటు అతని అనుచరులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ కలప రవాణా డంపులను దొరక్కుండా చేసేందుకు మంథని మండలం విలోచవరం గ్రామానికి చేరుకున్న శ్రీను ను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. స్కార్పియో వాహనంతో పాటు పది కలప దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని అడవుల నుంచి టేకు చెట్లను అక్రమంగా నరికివేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న శ్రీనివాసుపై ఏడు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.