దేశ రాజధాని ఢిల్లీలో ఈ దీపావళి టపాకాయల మోతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేవలం 'అనార్, ఫులిజార్' ఈ రెండు రకాల పర్యావరణహితమైన టపాకాయలను మాత్రమే సుప్రీంకోర్టు చట్టబద్దం చేసిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా దిల్లీ పోలీసు ప్రతినిధి ఎంఎస్ రంధవా మాట్లాడుతూ.. ఈ రెండు రకాల టపాకాయలు మాత్రమే అనుమతి ఉందని, మిగతా వాటిపై నిషేధం విధించినట్లు తెలిపారు. కొనేటప్పుడు వాటిపై ప్రభుత్వ అధికారిక స్టాంప్ చూసుకోవాలని చెప్పారు. పర్యావరణహిత టపాసులు రెండు రంగుల్లో మాత్రమే లభిస్తాయని వాటిపై ప్రభుత్వం అనుమతులతో ముద్రించిన క్యూఆర్ కోడ్ చూసుకోవాలని కోరారు. అవి కాకుండా ఇతర టపాసులు అమ్ముతూ ఎవరైనా దొరికితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ గ్రీన్క్రాకర్స్ 25 నుంచి 30 శాతం తక్కువ ధూళి, 50శాతం తక్కువ సల్ఫర్డైఆక్సైడ్ను విడుదల చేస్తాయని కేంద్ర మంత్రి హర్షవర్దన్ తెలిపారు. గతవారం నుంచి దేశ రాజధానిలో గాలి నాణ్యత పడిపోవడంతో పాటు, శీతాకాలం సమీపిస్తుండటం దీపావళి టపాకాయలపై ఈ నిబంధనలు తీసుకురావడం గమనార్హం. వాతావరణ కాలుష్యం దృష్ట్యా 2016లో ముగ్గురు చిన్నారుల నుంచి వచ్చిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు రాజధాని పరిధిలో టపాకాయలను నిషేధించిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత సెప్టెంబర్ 2017లో ఈ నిర్ణయాన్ని రద్దు చేసి మళ్లీ వెంటనే ఒక నెల తర్వాత నిషేధాన్ని తిరిగి అమలు చేసింది.