భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దులో ఓ గూఢచార పావురం చేజిక్కడం కలకలం రేపుతోంది. కశ్మీర్లోని కథువా జిల్లాలోని మన్యారీ గ్రామ ప్రజలు అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో హీరానగర్ సెక్టార్ వద్ద ఈ పావురాన్ని గుర్తించారు. దాన్ని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అది పాకిస్థాన్ బోర్డర్ వైపు ఎగురుతూ కిందపడిపోయిందని వారు తెలిపారు. పావురాన్ని క్షుణ్నంగా పరిశీలించగా.. దాని కాలుకి ఓ రింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పావురం రెక్కపై ప్రత్యేక కోడింగ్తో కూడిన నంబర్లు ఉండటంతో అది పాకిస్థాన్ గూఢచార కపోతంగా కథువా జిల్లా ఎస్పీ శైలేంద్ర మిశ్రా నిర్ధారించారు. దాన్ని ఆర్మీ అధికారులకు అప్పగించారు. పావురంపై ఉన్న కోడ్ను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రపంచమంతా కరోనా వైరస్ను కట్టడి చేసే చర్యల్లో నిమగ్నమై ఉంటే.. దాయాది దేశం మాత్రం తన వక్రబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూకశ్మీర్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
కరోనా వైరస్ పంజా విసురుతున్న సమయాన్ని అదనుగా చూసి కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి పాక్ వైపు నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో సరిహద్దుల వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేగాక భారత్లో అంతర్భాగమైన పీఓకేలోని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పాక్ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
పాక్ ప్రయత్నాలను ఎండగట్టడానికి భారత్ సిద్ధమైంది. గిల్గిట్ బాల్టిస్థాన్కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు పాక్ సుప్రీం కోర్టుకు లేదని పాక్ రాయబారికి భారత విదేశాంగ శాఖ అందించిన దౌత్యపరమైన లేఖలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాద సంస్థలు మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది.
కొన్ని ఉగ్రవాద సంస్థలు కశ్మీర్లో కరోనా వైరస్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. కశ్మీర్లో కల్లోలం చేయడానికి వచ్చిన హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్నకు చెందిన కొంత మంది టాప్ కమాండర్లను ఇటీవల భారత భద్రతా దళాలు ఎన్కౌంటర్లో హతమార్చిన విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం నుంచి బయటపడే సరికి కశ్మీర్లోకి చొచ్చుకుపోవాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దులో గూఢచర్యం చేసేందుకు ఓ పావురానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి భారత భూభాగంలోకి పంపించినట్లు అధికారులు భావిస్తున్నారు. కశ్మీర్లో ఆ పావురం ఎవరిని కలిసింది? అది తెచ్చిన సమాచారం ఏంటి? దానికి బదులుగా పంపిన సమాచారం ఏంటి? తదితర అంశాలను ఆర్మీకి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Who needs nukes when you have kabootars.. Suspected Pakistani #39;spy pigeon#39; carrying a #39;coded message#39; captured in Jammu and Kashmir#39;s Manyara village along the International Border. https://t.co/PvYlxnAi9I
mdash; Naila Inayat (@nailainayat) May 25, 2020