టెస్టు సిరీస్‌ని చేజార్చుకున్న ఇంగ్లాండ్‌ ‌కి గట్టి ఎదురుదెబ్బ

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 05:10 PM

టెస్టు సిరీస్‌ని చేజార్చుకున్న ఇంగ్లాండ్‌ ‌కి గట్టి ఎదురుదెబ్బ

భారత్ గడ్డపై ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌ని 1-3తో చేజార్చుకున్న ఇంగ్లాండ్‌ టీమ్‌కి టీ20 సిరీస్‌ ముంగిట గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం నుంచి అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఇంగ్లాండ్ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ మోచేతి గాయంతో ఈ సిరీస్ మొత్తానికీ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఆరంభం నుంచి జోప్రా ఆర్చర్‌ని మోచేతి గాయం వేధిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌తో అహ్మదాబాద్ వేదికగా గత శనివారం ముగిసిన చివరి టెస్టుకీ మోచేతి గాయంతోనే జోప్రా ఆర్చర్ దూరంగా ఉన్నాడు. దాంతో.. టీ20 సిరీస్‌లోనూ అతను ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ టీమ్ మెడికల్ స్టాఫ్ అతని గాయాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చిన చీఫ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్.. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు. వాస్తవానికి జోప్రా ఆర్చర్ తన మోచేతి గాయానికి సర్జరీ చేయించుకోవాలని ఆశించాడు. కానీ.. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆ తర్వాత అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్‌కప్.. ఆ వెంటనే యాషెస్ సిరీస్ జరగనుండటంతో.. సర్జరీని వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్ బౌలర్ కావడంతో.. సర్జరీ తర్వాత కొన్ని నెలలు ఆటకి అతను దూరంగా ఉండాల్సి ఉంటుంది. మార్చి 12 నుంచి 20 వరకూ ఐదు టీ20లు, మార్చి 26 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌తో ఇంగ్లాండ్ తలపడనుంది.






Untitled Document
Advertisements