"కేంద్రం మళ్ళీ లాక్ డౌన్ విధించబోదు"

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 11:55 AM


కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ 19 కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధించే ఛాన్స్ ఉందని భావిస్తూ ఉండొచ్చు. అయితే కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అంశంపై స్పష్టతనిచ్చింది.

కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధించబోదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా వైరస్ కట్టడికి స్థానికంగానే నియంత్రణ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున లాక్ డౌన్ వంటివి ఉండవని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పస్‌తో వీడియో మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.


రెండోసారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని, అయినా కూడా మరోసారి పెద్ద ఎత్తున లాక్ డౌన్ విధించే అవకాశం లేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయడానికి తాము ఇష్టపడమని పేర్కొన్నారు. కోవిడ్ రోగులను లేదా వారి కుటుంబాలకు భౌతిక దూరం పాటించడం వంటి పలు ఇతర స్థానిక నియంత్రణ చర్యల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించొచ్చని వివరించారు. లాక్ డౌన్ ఉండదని తెలిపారు.





Untitled Document
Advertisements