జెనీవా, జనవరి 09: భారత ప్రభుత్వం అనేక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లాగా తెరిచిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో కాలుష్యరహిత సంప్రదాయేతర ఇంధన వనరులను ఎక్కువ వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2011లో సౌర విద్యుత్ విధానంని రూపొందించుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం ఉన్న భారత్ ఆ సంస్థ నిబంధనల ప్రకారం అమెరికాకు చెందిన సోలార్ పరికరాల సంస్థల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. అయితే, విదేశీ కంపెనీల పోటీ ఎక్కువ కావడంతో దేశీయ సోలార్ ఎనర్జీ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంతో 'సోలార్ ప్యానెళ్లలోని మాడ్యుల్స్, సెల్స్లు ఇక్కడ తయారుచేసినవే అయి ఉండాలని' నిబంధనను భారత్ తీసుకొచ్చింది. ఈ నిబంధనను తప్పుపడుతూ 2013లో అమెరికా.. డబ్ల్యూటీవో ఆధ్వర్యంలోని వాణిజ్య కోర్టు(జెనీవా)ను ఆశ్రయించింది. డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం "సౌరశక్తి ఉత్పత్తి పరికరాల సరఫరా" ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించగా, అసలు తప్పు అమెరికాదేనని భారత్ వాదించింది.
అమెరికా ఆరోపణలను తిప్పికొడుతూ భారత్ గట్టి వాదన వినిపించింది. "డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం విదేశీ సంస్థలపై ఆంక్షలు విధించే అధికారం మాకు ఉంది. అదే సమయంలో ఆంక్షల సాకు చెప్పి ఒప్పందాల నుంచి తప్పుకోవాలని చూస్తే అది అమెరికా తన పక్షపాత వైఖరిని బయటపెట్టుకున్నట్లవుతుంది. నిబంధనల విషయంలో భారత్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. కాబట్టి అమెరికా చెప్పేదాంట్లో విషయంలేదు" అని భారత్ తెలిపింది. ఈ విషయాలను ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఒక ప్రటకనలో వెల్లడించింది.