ఒకవైపు బుల్లితెర పై రాణిస్తునే, మరోపక్క వెండి తెరపై కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తన పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా హైపర్ ఆది ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. జనసేన సభల్లో పలుమార్లు రాజకీయ ప్రసంగాలతో ఆకట్టుకున్న హైపర్ ఆది తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను ఇంతవాడిని చేసింది ‘జబర్దస్త్’షోనే అని చెప్పాడు. ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన వైసీపీ నాయకురాలు రోజాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. నాగబాబులానే ఆమె కూడా తనను ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు.
తాను పవన్ కల్యాణ్ అభిమానినని, సిద్ధాంతాలు నచ్చి ఆయనతో కలిసి నడుస్తున్నట్టు చెప్పాడు. పవన్ వ్యక్తిగతంగా ఎవరినీ దూషించరని, సమస్యల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని పేర్కొన్నాడు. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే తాను స్పందిస్తానని పేర్కొన్నాడు. పదవులు, టికెట్లు ఆశించి తాను జనసేనకు మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశాడు. ఒకవేళ తనకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా పోటీ చేస్తానని తెలిపాడు. పవన్ను గెలిపించడం కోసం తాను గెలుస్తానని పేర్కొన్నాడు. ఈసారి కూడా జనసేన తరపున ప్రచారం చేస్తానని హైపర్ ఆది వివరించాడు.