ఒకవైపు లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. మరో వైపు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటి గౌతమి బీజేపీని వీడి అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సిఎం పళనిస్వామి సమక్షంలో ఆమె అన్నాడీఎంకే పార్టీ కండువా కప్పుకున్నారు. గౌతమి బీజేపీలో దాదాపు 25 ఏళ్ల పాటు ఉన్నారు. అటువంటిది ఎన్నికల ముంగిట ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుని అన్నాడీఎంకేలో చేరడం గమనార్హం.
ఇంతకు ముందే బీజేపీపై గౌతమి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేశానని.. కానీ, కష్ట కాలంలో తనకు తగిన మద్దతు లభించలేదని ఇంతకు ముందు ఆమె వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో.. ఈరోజు పళనిస్వామి నివాసానికి వెళ్లి అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే తమిళ సినీ నటి గాయత్రి రఘురాం కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి అన్నాడీఎంకేలో చేరిన విషయం తెలిసిందే.