పెడదారులు పడుతున్న రేపటి తరం పై ఓ వ్యక్తి ఆవేదన.. తలిదండ్రుల తీసుకోవలసిన జాగ్రత్తలు

     Written by : smtv Desk | Mon, Feb 19, 2024, 09:35 AM

పెడదారులు పడుతున్న రేపటి తరం పై ఓ వ్యక్తి ఆవేదన..  తలిదండ్రుల తీసుకోవలసిన జాగ్రత్తలు

ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా రేపటి తరం భవిత ఏవిధంగా పెడదారులు పడుతుంది. అందుకు గల కారణాలు ఏంటి? తలిదండ్రులు పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటూ తనలో ఉన్న ఆవేదనను ఓ మెసేజ్ రూపంలో పోస్ట్ చేసారు. అతడు పెట్టిన పోస్టులో ఉన్న విషయం ఇలా ఉంది..
తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.

తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.

క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.

పిల్లలకి బడిలో భయంలేదు.
ఇంట్లో భయం లేదు.
అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.
వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు.
అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.
ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.

గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.
ఇది నిజం.

గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?

కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు!

5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి.

దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లి దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.

ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు.

పెన్ను ఉంటే పుస్తకం ఉండదు,
పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు.
భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం.
ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.

కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...?

భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!
అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.

స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట.
ఇదెలా సాధ్యమ్?

మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?

మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.

తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.

90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు.
ఇది యదార్ధం.

ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.

మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు.

అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు.
మా బాగు కోసమే అని అనుకునేవారు.

ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.

తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..

పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..!





Untitled Document
Advertisements