ఎమ్మెల్యేగా పోటి చేయాలంటే ఉండాల్సిన అర్హతులు.! పోటీ చేయాలంటే ఏం చేయాలి?

     Written by : smtv Desk | Mon, Feb 19, 2024, 09:45 AM

ఎమ్మెల్యేగా పోటి చేయాలంటే ఉండాల్సిన అర్హతులు.! పోటీ చేయాలంటే ఏం చేయాలి?

భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టే స్వేఛ్చ, స్వాతంత్ర్యం ఉంది. అయితే కొన్నికొన్ని పదవులకు కొన్ని నియమం నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటి చేయాలంటే ఉండాల్సిన అర్హతులు.! పోటీ చేయాలంటే ఏం చేయాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం..
* నామినేషన్ల పరిశీలన రోజు నాటికి 25 ఏళ్లు పూర్తయి ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 173(బీ) ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కచ్చితంగా 25 ఏళ్లు నిండాలి.
* ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
* ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటే తనకు ఓటు హక్కు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
* ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాలు, ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గాలలో పోటీ చేసేవారు ఆయా వర్గాలకు చెందినవారై ఉండాలి. ఈ మేరకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
* ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు జనరల్ కేటగిరీ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయొచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 4, 5 దీనికి అనుమతిస్తున్నాయి.

ఇలా అయితే ఎమ్మెల్యే కాలేరు..
* ఒక రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి, మరో రాష్ట్రంలో పోటీ చేయడానికి వీల్లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఇలాంటి అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉండాలి.
* ఏ కేసులోనైనా దోషిగా నిర్ధరణై రెండేళ్ల జైలు శిక్ష పడితే ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(3) ప్రకారం అలాంటివారు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు.
* దోషిగా తేల్చుతూ ఇచ్చిన తీర్పుపై స్టే ఉంటే ఆ సమయంలో ఎన్నికలలో పోటీ చేయొచ్చని సుప్రీంకోర్టు ఓ కేసులో చెప్పింది.
* సర్వీస్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు కారు. ఎన్నికలలో పోటీ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

డిపాజిట్ ఎంత?
* చట్ట ప్రకారం తమకు అన్ని అర్హతలు ఉన్నాయి అనుకున్నవారు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే అందుకు కొంత మొత్తం సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాలి.
* ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 34(1) ప్రకారం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
* ఎస్సీ, ఎస్టీలకు ఈ మొత్తంలో రాయితీ ఉంది. వారు రూ. 5 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే చాలు.
* ఎస్సీ, ఎస్టీలు తమకు కేటాయించిన రిజర్వ్ డ్ నియోజవర్గాల నుంచే కాకుండా జనరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది.
* పోటీ చేసిన నియోజకవర్గంలో చెల్లుబాటైన ఓట్లలో ఆరింట ఒక వంతు సాధించిన అభ్యర్థులకు డిపాజిట్ మొత్తం వెనక్కు ఇస్తారు. ఆ మేరకు ఓట్లు సాధించని అభ్యర్థులు డిపాజిట్ కోల్పోతారు.

నామినేషన్ వేయాలంటే ఇవి తప్పనిసరి
* అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనుకునేవారు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ సమర్పించాలి. నామినేషన్ వేసేటప్పుడు వారి అభ్యర్థిత్వాన్ని ఇతరులు ప్రతిపాదించాలి. అలా ప్రతిపాదించేవారిని ప్రపోజర్ అంటారు.
* గుర్తింపు పొందిన జాతీయ పార్టీ నుంచి కానీ రాష్ట్ర పార్టీ నుంచి కానీ పోటీ చేసే అభ్యర్థులకైతే కనీసం ఒక ప్రపోజర్ ఉండాలి.
* అదే స్వతంత్ర అభ్యర్థులకైతే కనీసం 10 మంది ప్రపోజర్లు ఉండాలి. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(1) ప్రకారం ఇది తప్పనిసరి.
* భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) దగ్గర రిజిస్టరైనా ఇంకా గుర్తింపులేని పార్టీలు(రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్) నుంచి పోటీ చేసే అభ్యర్థులకూ 10 మంది ప్రపోజర్లు ఉండాలి.
* తగినంత మంది ప్రపోజర్లు లేనప్పుడు వారి నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. అలాగే, ప్రపోజర్లకు అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటు హక్కు లేకపోయినా వారి ప్రతిపాదన చెల్లదు.
* నామినేషన్ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థి ఆస్తులు, అప్పులు, కేసులు వంటి అన్ని వివరాలూ ఉండాలి.
* భారతదేశ పౌరుడినని / పౌరురాలినని , రాజ్యాంగానికి, భారత సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉంటాననే ప్రమాణ పత్రం నామినేషన్ల సమయంలో సమర్పించాలి.
* వీటితో పాటు నామినేషన్ ల సమయంలో రిటర్నింగ్ అధికారి అడిగే ఏ ధ్రువపత్రాన్నైనా అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు నామినేషన్ల పరిశీలన తుది గడువు వరకు సమయం ఉంటుంది.
* ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 36 ప్రకారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే, అర్హత నిర్ణయించే అధికారం రిటర్నింగ్ అధికారిదే.

నామినేషన్ వేసేటప్పుడు ఎంత మంది వెళ్లాలి?
* నామినేషన్లు వేసేటప్పుడు చాలా మంది అభ్యర్థులు భారీ ఊరేగింపుగా వెళ్తుంటారు. అయితే, రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు మాత్రం ఇలాంటి ఊరేగింపులకు అనుమతి ఉండదు. ఆ 100 మీటర్ల దూరంలోకి గరిష్ఠంగా 3 వాహనాలనే అనుమతిస్తారు.

* రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి కూడా పెద్దసంఖ్యలో జనం వెళ్లడానికి వీల్లేదు. అభ్యర్థి సహా మొత్తం అయిదుగురు మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుంది.

* నామినేషన్ పరిశీలించేటప్పుడు అభ్యర్థి, ఆయన ఎలక్షన్ ఏజెంట్, ఆయన ప్రపోజర్లలో ఒకరు, మరొక వ్యక్తి ఎవరైనా (న్యాయవాదిని తీసుకెళ్లొచ్చు) వెళ్లొచ్చు. ఇతరులు ఎవరూ వెళ్లడానికి వీల్లేదు.

(ఆధారం: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్-1951, భారత రాజ్యాంగం)





Untitled Document
Advertisements