రైతుబిడ్డ బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో లభించిన ఊరట

     Written by : smtv Desk | Wed, Feb 21, 2024, 07:28 PM

రైతుబిడ్డ  బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో లభించిన  ఊరట

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ గెలుపుని సంపూర్ణంగా అస్వాదించకముందే చిక్కుల్లో పడ్డాడు. పోలీస్ కేసులు, అరెస్ట్ వారెంట్, రిమైండ్ ఇలా అనేక సమస్యలు చుట్టూ ముట్టాయి. చివరకు షరతులతో కూడిన బెయిల్ పొంది కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అయితే తాజాగా ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు కానవసరం లేదని కోర్టు పేర్కొంది.
బిగ్ బాస్ షో ముగిసిన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో.. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు రెండు నెలల పాటు పోలీసుల ఎదుట హాజరవుతుండాలన్న షరతు విధించింది.
కోర్టు పేర్కొన్న రెండు నెలల సమయం ముగియడంతో పల్లవి ప్రశాంత్ కండిషన్ రిలాక్సేషన్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన పనిలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన అనంతరం పల్లవి ప్రశాంత్ విజేత ట్రోఫీతో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు అతడిని ఊరేగింపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం కావడానికి కారకులయ్యారంటూ పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏ1గా పల్లవి ప్రశాంత్, ఏ2గా అతడి సోదురుడు మనోహర్, ఏ3గా వినయ్ లను చేర్చారు.







Untitled Document
Advertisements