మన్నార్గుడి, జూన్ 10 : తమిళనాట మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్, ప్రముఖ నటుడు కమల్హాసన్ సొంత రాజకీయ పార్టీలను ప్రారంభించారు. సూపర్స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పడతానని ప్రకటించారు. తాజాగా శశికళ సోదరుడు వి.దివాకరన్ కూడా కొత్త పార్టీని పెట్టారు. 'అన్నా ద్రవిడార్ కజగమ్(ఏడీకే)' పేరుతో నేడు పార్టీని ప్రారంభించారు. నలుపు, ఎరుపు రంగుల్లో పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దివాకరన్ మాట్లాడుతూ.. ఏడీకే పార్టీకి తాను జనరల్ సెక్రటరీగా ఉండనున్నట్లు ప్రకటించారు. 2016 డిసెంబరులో జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోవడం, ఆ తర్వాత తిరిగి ఒక్కటయ్యాయి. ఈ క్రమంలో శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ను పార్టీ నుంచి దూరం పెట్టారు. దీంతో దినకరన్ సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఆ పార్టీకి 'అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం'(ఏఎంఎంకే) పేరు పెట్టారు.